ఏ ఉద్యమానికైన మీడియా సహకారం అత్యంత కీలకం. పత్రికలు, టీవీ ఛానళ్లు, వెబ్ సైట్లు పుంఖాను పుంఖాలుగా పుట్టుకొచ్చిన నేటి తెలుగు సమాజంలో తెలంగాణ ఉద్యమం పట్ల ఉన్న వివక్ష అందరికి తెలిసిందే. దీనికి ముఖ్య కారణం తెలంగాణ కు చెందని మీడియా సామ్రాజ్యం. ఒకటి అరా చానళ్లు, పత్రికలు ఈ ప్రాంతానికి చెందిన వారివైనా... వారు ఉద్యమానికి తోడ్పడుతున్న పాత్ర పరిమితం అని చెప్పవచ్చు. రాగ ద్వేషాలకు, పక్షపాతానికి అతీతంగా వ్యవహరించవలసిన మీడియా స్వప్రయోజనాలకు, ప్రాంతాభిమానానికి దాసోహం అయిపోయింది. తెలంగాణ వస్తే తమ ప్రయోజనాలకు భంగం కలుగుతుందనే భయమే ఈ వివక్షకు ప్రధాన కారణం. వివక్ష ఉంది అనటానికి రెండు చిన్న ఉదాహరణలు.
1. చిరంజీవి సమైక్యవాద గళం విప్పగానే అతని అల్లుడు శిరీష్ భరద్వాజ్ తెలంగాణ కు జై అనటం మీడియాలో స్క్రోలింగ్ కొన్ని నిమిషాలు తప్ప ఎక్కడా వార్తలు రాలేదు. అదే లగడపాటి కి మద్దతు గా విజయవాడ శిబిరానికి వచ్చిన వరంగల్ యువకుడిని హైలైట్ చేశారు.
2. కేసీఆర్ నిరాహార దీక్ష మీద అవాకులు చెవాకులు మాట్లాడి ఆర్భాటంగా ప్రకటించి తిరుపతిలో చేపట్టిన 'ఒక పూట' దీక్షను మధ్యాన్నం మూడింటికే ముగించి శిబిరంలో నిరుత్సాహం నింపిన మోహన్ బాబు గురించి కూడా ఎక్కడా వార్త రాలేదు. పైగా మోహన్ బాబు విసిరిన 'ఇంటి మీద రాళ్లు వేయించుకునే' సవాలుకు ప్రాముఖ్యం ఇచ్చారు. ఇవి రెండు చిన్న ఉదాహరణలు మాత్రమే. ఇలాంటివి కోకొల్లలు.
ముఖ్యమంత్రి మొదలుకుని ప్రభుత్వ,పాలనా యంత్రాంగం అన్ని(దాదాపు)పార్టీలు చూపిస్తున్న వివక్షకు తోడు నిస్వార్థం గా ఉండాల్సిన మీడియా కూడా వీరికి తోడవటం సగటు తెలంగాణ పౌరుడి మనస్సు చివుక్కుమంటుంది.
Friday, December 18, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment