Tuesday, December 8, 2009

నిజాంను ఎదుర్కోవడానికి సేనలు వస్తున్నాయా?

1948 లో భారత ప్రభుత్వం తో కలవను అన్న నిజాం పై ప్రయోగించిన సైనిక చర్య గుర్తుకు వస్తుంది నేటి పోలీసుల బలగాలను చూస్తుంటే. నేడు తెలంగాణ ప్రతి పల్లె గుండె పై పోలీసుల పద ఘట్టనలు కవాతు చేస్తున్నాయి. 23 వేల సాధారణ పోలీసులకు బలగాలకు తోడు, 1650 సెంట్రల్ రిసర్వ్ పోలీసులు (సీఆర్పిఎఫ్), 1470 రాపిడ్ ఆక్షన్ ఫోర్స్ పోలీసులు, 630 మంది బార్డర్ సెక్యూరిటీ దళాలు (బిఎస్ఎఫ్), జిల్లా స్థాయిలో ఒక్కో చోట 2000 నుంచి 2500 మంది పోలీసులు, నగరంలో 85కు పైగా చెక్ పోస్టులు వీటన్నింటినీ ఆజమాయిషీ చేయడానికి 60 మంది ఐపీఎస్ ర్యాంక్ అధికారులను నియమించారు. తెలంగాణా అంతటా 144 వ సెక్షన్ విధించారు.

జిల్లాల వ్యాప్తం గా విద్యార్థులను వారి నాయకులను అరెస్ట్ చేయడం, కళాకారులను నిర్భందించటం చూస్తుంటే మనం ప్రజాస్వామ్యం లో ఉన్నామా లేదా నియంతల పరిపాలనలో ఉన్నామా అనిపిస్తుంది. విదేశాలలో ఉన్న తెలంగాణ మద్దతు దారులు తమ నిరసన తెలపటానికి ఉరేగింపులకు అనుమతులు సునాయాసంగా పొందుతూ ఉంటే స్వదేశం లో ఇంతటి దౌర్బాగ్య పరిస్థితులలో ఉన్నామా అని అనిపిస్తుంది.

అదీ కాకుండా ఒక పక్క ఉద్యమ నాయకుడు చావు బతుకుల మధ్యన కొట్టు మిట్టాడుతుంటే, అమ్మగారు సోనియా గాంధీ మన రాష్ట్రం నుంచి వెళ్లే వెన్నెముక లేని నాయకులను పట్టించుకోకుండా జార్కండ్ ప్రచారానికి, పుట్టిన రోజులు జరుపుకోవడం లో ఉత్సాహం చూపిస్తున్నారు. నేడు ఆమె చూపుతున్నఉత్సాహం లో పదవ వంతు మూడున్నర కోట్ల ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష అయిన తెలంగాణపై చూపితే బాగుంటుంది. మరి సోనియా గాంధీ నేడు తన పుట్టిన రోజు కేక్ కట్ చేస్తారో లేదా ఈ ప్రాంత ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా మూడున్నర కోట్ల గుండెలను కోస్తారో మరి కొన్నిగంటల్లో తేలుతుంది.

-తెలంగాణ భూమి పుత్ర

No comments:

Post a Comment