Thursday, December 17, 2009

జెండాలు వేరు కాని అజెండా ఒక్కటే !

అంతా ఒక్కటయ్యారు ! నీతి, నియమాలు, పార్టీ, జండా, వర్గం అన్ని పక్కన పెట్టి అంతా ఏకమయ్యారు. అదీ... ౫౦ ఏళ్ల నుంచి జరుగుతున్న ఒక పోరాటానికి వ్యతిరేఖంగా అంతా ఒక్కటయ్యారు. చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వర రావు, జగన్, దివాకర్ రెడ్డి, చిరంజీవి, మోహన్‌బాబు, లగడపాటి, దేవినేని, జయప్రకాష్ నారాయణ, రాఘవులు ఇలా ఒకదానికొకటి పొంతన లేని పేర్లు. ఒకరిని చూస్తే ఇంకొకరికి జీవిత కాలపు శతృత్వం, అయినా కూడా పాలు నీళ్ళు లాగా కలిసి పోయారు. సాటి తెలుగు వారు అంటూనే తెలంగాణ వారి అర్ధ శతాబ్దపు అపరిష్కృత కల నెరవేరుతుంటే మొకాలడ్డుతున్నారు. చందమామ కథల్లోని సమైక్య భావన ఫార్ములా తీసుకు వచ్చి ఆంధ్ర సాధారణ ప్రజలను చిన్నపిల్లలు చేసి రెచ్చగొడుతున్నారు.

అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం అన్న కాంగ్రెస్, తెలంగాణ కు మేము అనుకూలం, బిల్లు పెడితే సహకరిస్తాం అన్న చంద్రబాబు, సామాజిక తెలంగాణ అన్న చిరంజీవి ఇలా ఒకళ్ళని మించి ఒకళ్ళు ఈరోజు పచ్చి దగాకు సిద్ధపడ్డారు. తెలంగాణ వస్తే నీళ్ళు రావు, సజ్జన్నమె తీనాల్సి వస్తుంది, ఉద్యోగాలు రావు, హైదరాబాద్ లో పరాయి వాళ్ళం అవుతాము అని అర్ధ సత్యాలు, అసత్యాలు ప్రచారం చేసి పబ్బం గడుపుకుంటున్నారు. కానీ ప్రజలంతా అమాయకూలేమీ కాదు. భిన్న ధ్రువాలు అయిన రాజకీయ వ్యభిచారులు ఎందుకు కలిసి పోయారో ఊహించగల విజ్ఞులు నేటి ప్రజలు. అయితే వీరిని చూస్తే ఒకటి అనాలనిపిస్తుంది, అదే భిన్నత్వంలో ఏకత్వం వీరి సమైక్యం. జెండాలు వేరు కాని అజెండా ఒక్కటే !

No comments:

Post a Comment